loading

0%

భారత ఫార్మా కంపెనీలపై ట్రంప్ సుంకాల ప్రభావమేంటి!!?

BBC నుండి సేకరణ 

వచ్చే నెల నుంచి భారత్‌పై అదనపు సుంకాలు విధించనున్నట్లు ట్రంప్ చేసిన ప్రకటనతో లక్షలాది మంది అమెరికన్ల మెడికల్ బిల్లులు పెరిగే అవకాశముంది. ఈ క్రమంలోనే, అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే దిశగా అక్కడి అధికారులతో చర్చలు జరిపేందుకు భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ముందస్తు పర్యటన షెడ్యూల్ లేకపోయినప్పటికీ, గత వారం అమెరికా వెళ్లారు. అమెరికా నుంచి భారతదేశానికి దిగుమతి అవుతున్న వస్తువుల మీద విధిస్తున్న పన్నులకు ప్రతిగా, భారత్ నుంచి అమెరికాకు దిగుమతి అవుతున్న వస్తువులపై ఏప్రిల్ 2 నుంచి పన్నులు పెంచనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అయితే, భారత్‌లోని ఔషధాల వంటి కీలక పరిశ్రమలపై పన్నుల భారం మోపవద్దని గోయల్ కోరుతున్నారు.  అమెరికన్లు వాడే జనరిక్ ఔషధాల్లో దాదాపు సగం మందులు భారత్‌ నుంచే వస్తున్నాయి.

విరివిగా వాడే ప్రముఖ బ్రాండెడ్ ఔషధాల స్థానంలో చౌకగా లభించే జనరిక్ మెడిసిన్ భారత్ నుంచే వస్తోంది. అమెరికన్ వైద్యులు సూచించే ప్రతి 10 జనరిక్ ఔషధాల్లో 9 భారత్‌ నుంచే అమెరికాకు దిగుమతి అవుతున్నాయి. దీని వల్ల అమెరికన్ల వైద్య ఖర్చు వందల కోట్లు తగ్గుతోంది. 2022లో భారతీయ జనరిక్ ఔషధాల వల్ల 219 బిలియన్ డాలర్లు(అంటే దాదాపు 19 లక్షల కోట్ల రూపాయలు) ఆదా అయినట్లు కన్సల్టింగ్ సంస్థ ఐక్యూవీఐఏ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. వాణిజ్య ఒప్పందం లేకుంటే, ట్రంప్ విధించే పన్నుల వల్ల చౌకగా లభించే భారతీయ జనరిక్ ఔషధాలు కూడా భారంగా మారతాయి. ట్రంప్ విధించే పన్నుల వల్ల కొన్ని సంస్థలు బలవంతంగా అమెరికన్ మార్కెట్ నుంచి వైదొలగాల్సి వస్తుంది. దీని వల్ల ఔషధాల కొరత పెరిగే అవకాశముందని నిపుణులు అంటున్నారు. పన్నుల వల్ల "డిమాండ్- సప్లయి సమతుల్యతను దెబ్బతీయొచ్చు" అంతే కాకుండా ఇన్సూరెన్స్ లేనివాళ్లు, పేదవాళ్ల వైద్య ఖర్చులు విపరీతంగా పెరుగుతాయని యేల్ యూనివర్సిటీలో డ్రగ్ కాస్టింగ్ నిపుణురాలు మెలిస్సా బార్బర్ చెప్పారు.

వివిధ రకాల అనారోగ్య పరిస్థితులతో బాధపడుతున్న వారిపై దీని ప్రభావం పడుతుంది.

అమెరికాలో తీవ్ర మానసిక ఆందోళన, మానసిక అనారోగ్య సమస్యలకు 60 శాతానికి పైగా భారతీయ ఔషధాలను సూచిస్తున్నారని ఐక్యూవీఐఏ అధ్యయనంలో తేలింది.‘ట్రంప్‌తో వాణిజ్య యుద్ధంలో గెలుస్తాం’ కెనడాకు కాబోయే ప్రధాని మార్క్ కార్నీ ప్రతిజ్ఞ

భారత ఫార్మా సంస్థలు, అమెరికా పన్నులు

అమెరికాకు దిగుమతయ్యే ఔషధాల మీద ట్రంప్ పన్నులు విధిస్తే, లక్షల మంది వాడే ఔషధాల ధరలు పెరుగుతాయి.

యాంటీడిప్రెస్సెంట్ ఔషధమైన సెర్ట్రాలైన్‌ను అమెరికన్ వైద్యులు రోగులకు ఎక్కువగా సూచిస్తారు. భారత్ నుంచి సరఫరా అయ్యే అత్యవసర ఔషధాల మీద అమెరికన్లు ఎంతలా ఆధారపడుతున్నారో చెప్పడానికి ఈ ఔషధం ఒక ఉదాహరణ.

భారతీయేతర సంస్థలు అమ్ముతున్న ఔషధాలతో పోలిస్తే వీటి ధరలు దాదాపు సగం. "మమ్మల్ని ఈ విషయం బాగా కలవరపెడుతోంది" అని తక్కువ ధరకు ఔషధాలు అందించేందుకు పోరాడుతున్న పబ్లిక్ సిటిజన్స్ సంస్థకు చెందిన లాయర్ పీటర్ మేబర్దుక్ చెప్పారు. చైనా నుంచి దిగుమతి అయ్యే ఔషధాల మీద పన్నులు పెంచడంతో, అమెరికన్ ఆసుపత్రులు, జనరిక్ ఔషధాల ఉత్పత్తిదారుల నుంచి ట్రంప్‌ ఇప్పటికే ఒత్తిడి ఎదుర్కొంటున్నారు.

అమెరికాలో అమ్మే 87 శాతం ఔషధాలకు సంబంధించిన ముడి పదార్ధాలు అమెరికా వెలుపల ఉన్నాయి. ఇందులో ఎక్కువ భాగం చైనాలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఔషధాల తయారీకి అవసరమైన ముడి పదార్ధాల్లో 40 శాతం చైనా నుంచే సరఫరా అవుతున్నాయి.

ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చైనా దిగుమతులపై పన్నుల్ని 20 శాతం పెంచారు. దీంతో ఔషధాల తయారీకి అవసరమైన ముడి పదార్ధాల ధరలు కూడా పెరిగాయి.

ఈ పన్నుల్ని తప్పించుకోవాలంటే ఔషధాల తయారీ సంస్థలు అమెరికాలో కంపెనీలు ఏర్పాటు చేయాలని ట్రంప్ చెబుతున్నారు. ఫైజర్, ఎలి లిలీ వంటి ప్రముఖ ఫార్మా సంస్థలు తమ సంస్థలలో కొన్నింటిని అమెరికాకు తరలించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పాయి. అయితే, చౌక ధరలకు ఔషధాలను విక్రయిస్తున్న సంస్థలు అందుకు సిద్ధంగా లేవు.

భారతదేశంలో అతి పెద్ద ఔషధ తయారీ సంస్థ సన్ ఫార్మా చైర్మన్ దిలీప్ సంఘ్వి గత వారం జరిగిన ఫార్మా సంస్థల సమావేశంలో మాట్లాడుతూ, తమ కంపెనీ ఒక్కో మందుల డబ్బాను 1 డాలర్ నుంచి 5 డాలర్ల మధ్య అమ్ముతుందని, ఈ ధరల వల్ల తమ కంపెనీని అక్కడకు తరలించడం సాధ్యం కాదని చెప్పారు.

"అమెరికాలో ఔషధాల ఉత్పత్తి ఖర్చుతో పోల్చుకుంటే భారత్‌లో ఔషధాల తయారీ ఖర్చు మూడు నాలుగురెట్లు తక్కువ" అని ఐపీఏకు చెందిన సుదర్శన్ జైన్ చెప్పారు.

ఇప్పటికిప్పుడు అమెరికాకు సంస్థలను తరలించడం అసాధ్యం. అమెరికాలో ఒక సంస్థను ఏర్పాటు చేయాలంటే కనీసం పదేళ్ల సమయం, 2 బిలియన్ డాలర్ల నిధులు (దాదాపు 17,357 కోట్ల రూపాయలు) అవసరం. ఇది కేవలం నిర్మాణానికి సంబంధించిన వ్యయం మాత్రమే అని లాబీ గ్రూప్ ఫార్మా చెబుతోంది.