loading

0%

కట్నం వద్దు.. వధువే చాలంటూ లక్షల రూపాయలు తిరిగిచ్చేశాడు

నేటి రాకెట్ యుగంలోనూ వరకట్న వేధింపులు కొనసాగుతున్నా..హర్యానాకు చెందిన న్యాయవాది వికాస్ రాణా ఇందుకు విరుద్ధంగా కట్నం డబ్బులు తిరిగి ఇచ్చేసి.. పలువురుకి ఆదర్శంగా నిలిచారు. తనకి అమ్మాయిని ఇస్తున్నారు.. అది చాలని, అత్తింటి వారు ఇచ్చిన రూ.31 లక్షల కట్నాన్ని సున్నితంగా తిరస్కరించాడు. కేవలం ఒక రూపాయి, కొబ్బరికాయతో వివాహం చేసుకుని, డబ్బుకు అతీతంగా సంబంధాలకు విలువనిచ్చే తన గొప్ప మనసును చాటుకున్నారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

నేటి రాకెట్ యుగంలో కూడా వరకట్న వేధింపులు తప్పడం లేదు. అత్తింటికి వచ్చే ఆడపిల్లంటే అదనపు ఆదాయంగా భావించే వారు కోకొల్లలుగా ఉన్నారు. వరకట్న వేధింపులకు పాల్పడే వారిలో ఉన్నత చదువులు చదివి గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్న వారు, కోటీశ్వరులు కూడా ఉండటం చూస్తున్నాం. సమాజంలో అందరూ ఇలానే ఉంటారా అంటే ఉండరు.

ఇప్పుడు మనం చెప్పుకోబోయో లాయర్‌లాంటి వాళ్లు కూడా ఉంటారు. సదరు లాయర్.. నాకు మీ కుమార్తెను ఇస్తున్నారు అదే ఎక్కువ.. తనతో పాటు వచ్చే కట్నం డబ్బును నేను ఆశించడం లేదంటూ.. అత్తింటి వారు ఇచ్చిన లక్షల రూపాయల కట్నం డబ్బులను వారికి తిరిగి ఇచ్చి.. తన మంచి మనసు చాటుకున్నాడు. కట్నంగా కేవలం ఒక్క రూపాయి, కొబ్బరి కాయ తీసుకుని.. వివాహం చేసుకుని.. ఎందరికో ఆదర్శంగా నిలిచాడు. ఆ వివరాలు..

ఈ సంఘటన హరియాణాలోని కురుక్షేత్రలో చోటు చేసుకుంది.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సహారన్‌పుర్‌ జిల్లా భాబ్సి రాయ్‌పుర్‌ గ్రామానికి చెందిన శ్రీపాల్‌ రాణా అనే వ్యక్తి కుమారుడు వికాస్‌ రాణా కట్నం డబ్బులు వద్దని.. వాటిని తిరిగి ఇచ్చేసి తన మంచి మనసు చాటుకున్నాడు. న్యాయవాది అయిన వికాస్ రాణా.. ముందు నుంచి అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి. పైగా రాజకీయ కుటుంబానికి చెందిన వాడు. ఆయన తండ్రి అయిన శ్రీపాల్‌ రాణా బీఎస్పీ టికెట్‌పై యూపీలోని కైరానా లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేశారు.

కొన్ని రోజుల క్రితం వికాస్‌ రాణాకు హరియాణాలోని లుక్ఖి గ్రామానికి చెందిన అగ్రికా తన్వర్‌ అనే యువతితో పెళ్లి నిశ్చయం చేశారు పెద్దలు. ఏప్రిల్ 30న వీరి వివాహం జరిగింది. పెళ్లి క్రతువు నిమిత్తం.. వికాస్‌ రాణా తన కుటుంబంతో కలిసి కురుక్షేత్రకు వెళ్లారు. నగరంలోని ఒక హోటల్‌లో వివాహ వేడుకకు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా తిలకం దిద్దే వేడుక జరుగుతున్న సమయంలో వికాస్‌ రాణాకు వరకట్నంగా రూ.31 లక్షల నగదును వధువు తల్లిదండ్రులు ఇచ్చారు.

అయితే వికాస్ రాణా ఆ మొత్తాన్ని పెళ్లి కుమార్తె తల్లిదండ్రులకు తిరిగి ఇచ్చేశాడు. తమకు వధువే కట్నం అని.. ఆమెను తమ ఇంటికి పంపితే చాలు అని చెప్పి.. తన మంచి మనసు చాటుకున్నాడు. ఇరువైపుల పెద్దలు కూడా అందుకు అంగీకరించారు. ఆ తర్వాత వికాస్, అగ్రికా తన్వర్‌ల వివాహ వేడుకను కేవలం ఒక కొబ్బరికాయ, రూపాయి నాణెంతో జరిపించారు. లక్షల రూపాయల కట్నం డబ్బులను వద్దంటూ తిరిగి ఇచ్చేసిన వికాస్ రాణా వ్యక్తిత్వాన్ని ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు.