loading

0%

భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రమాణం

రెండవ దళిత ప్రధాన న్యాయమూర్తిగా చరిత్రలోకి..

సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రితోపాటు, కేంద్ర మంత్రులు, ఇతర అతిథుల సమక్షంలో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. ప్రధాని నరేంద్రమోదీ ఆయనకు అభినందనలు తెలిపారు. 2019 మే 24 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న ఆయన అనేక రాజ్యాంగ ధర్మాసనాల్లో సభ్యుడిగా చరిత్రాత్మక తీర్పుల్ని వెలువరించారు. సీజేఐగా ఆరు నెలలు కొనసాగి నవంబరు 23న పదవీవిరమణ చేస్తారు. సీజేఐ పీఠాన్ని అధిరోహించిన రెండో దళిత వ్యక్తిగా గవాయ్ పేరు పొందారు. మహారాష్ట్రలోని అమరావతిలో 1960 నవంబరు 24న జన్మించిన గవాయ్ 1985 మార్చి 16న న్యాయవాదిగా వృత్తి జీవితం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు. 2003 నవంబరు 14న బాంబే హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ గవాయ్ 2005 నవంబరు 12న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొంది ఆ హైకోర్టు ప్రధాన ధర్మాసనం ఉన్న ముంబయితోపాటు, నాగ్పుర్, ఔరంగాబాద్, పనాజీ ధర్మాసనాల్లో సేవలందించారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. గత ఆరేళ్లలో జస్టిస్ గవాయ్ సుమారు 700 ధర్మాసనాల్లో భాగస్వామ్యం పంచుకొని రాజ్యాంగ, పరిపాలన, సివిల్, క్రిమినల్ చట్టాలు, వాణిజ్య వివాదాలు, ఆర్బిట్రేషన్, విద్యుత్తు, విద్య, పర్యావరణానికి సంబంధించిన కేసులను విచారించారు.