loading

0%

ఏపీలో కరోనా కేసు నమోదు.. మహిళకు పాజిటివ్‌

ఏపీలో కరోనా కేసు నమోదు.. మహిళకు పాజిటివ్‌ - ఆంధ్రప్రదేశ్‌లో తొలి కేసు విశాఖపట్నంలో నమోదైంది

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్‌లో తొలి కేసు విశాఖపట్నంలో నమోదైంది. 28 ఏళ్ల మహిళకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది, ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు మాస్క్‌లు ధరించాలని, లక్షణాలు ఉంటే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రజలు గుంపులుగా ఉండొద్దని, ప్రార్థనా సమావేశాలు, సామాజిక సమావేశాలు, పార్టీలు, వంటి సామూహిక సమావేశాల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులో మరోసారి టెన్షన్ పెడుతున్నాయి. సింగపూర్, హాంగ్‌కాంగ్, చైనాతో పాటుగా మరికొన్ని దేశాల్లో కేసుల సంఖ్య పెరిగింది. భారత్‌లో కూడా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.. అయితే తెలుగు రాష్ట్రాలను కూడా కరోనా టెన్షన్ వెంటాడుతోంది. ఈ క్రమంలో ఏపీలో తొలి కరోనా కేసు నమోదైంది. విశాఖపట్నంలోని మద్దిలపాలెంలో 28 ఏళ్ల మహిళకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ముందుగా మలేరియా డెంగ్యూ అని భావించి నాలుగు రోజుల క్రితం వైద్య పరీక్షలు చేయగా.. ఆ శాంపిల్‌ను కేజీహెచ్‌లోని వైరాలజీ ల్యాబ్‌లో కూడా పరీక్షించారు. అక్కడ కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధారించారు. చివరకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఆమెను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేయగా.. ముందస్తు జాగ్రత్తగా వారం రోజుల పాటు హోమ్ ఐసోలేషన్‌లో ఉండాలని డాక్టర్లు సూచించారు. ఆమెతోపాటు కుటుంబసభ్యులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేశారు. కోవిడ్ పాజిటివ్ కేస్ వచ్చిన చుట్టుపక్కల ప్రాంతాల్లో మూడు టీమ్‌లతో ఇంటింటికీ సర్వే చేశారు. ముందస్తు జాగ్రత్తగా ఆ ఇంటి చుట్టుపక్కల వారందరికీ నిర్ధారణ పరీక్షలు చేయాలని నిర్ణయించారు. 70 ఇళ్ల పరిధిలోని 200 మందికి సంబంధించిన ఆరోగ్య వివరాలు సేకరించారు.

అయితే పాజిటివ్ తేలిని మహిళ ఎక్కడికీ ప్రయాణం చేయలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ముందు జాగ్రత్తగా అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశామని ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండియన్ చెప్పారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అప్రమత్తంగా ఉంటే చాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లోకి వెళ్లినప్పుడు మాస్క్‌ ధరించాలని సూచిస్తున్నారు. అలాగే బయటకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ముందస్తు జాగ్రత్తగా మాస్క్‌లు ధరించాలని సూచిస్తున్నారు.

కరోనా టెన్షన్ వెంటాడుతున్న వేళ వైద్య, ఆరోగ్య శాఖ ప్రజలకు కొన్ని సూచనలు చేసింది. కరోనా వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. జ్వరం, దగ్గు, జలుబు, గొంతునొప్పి లక్షణాలు ఉంటే ఇంట్లో విడిగా ఉండాలని సూచించారు. డాక్టర్ల సలహా మేరకు మందులు వాడాలని.. ప్రయాణాల్లో, జనసమూహాల్లో మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు. కొవిడ్ కేసుల ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చినవారు అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని.. తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలన్నారు.

అంతేకాదు ప్రజలు గుంపులుగా ఉండొద్దని.. ముఖ్యంగా ప్రార్థనా సమావేశాలు, సామాజిక సమావేశాలు, పార్టీలు, వంటి సామూహిక సమావేశాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు. రైల్వే స్టేషన్లు, బస్‌స్టాండ్లు, ఎయిర్‌పోర్టులలో కోవిడ్‌-19 నిబంధనలు పాటించాలని కోరారు. వృద్ధులు, గర్భిణులు ఇళ్లల్లోనే ఉండాలని.. ఇతర దేశాల నుంచి వచ్చిన వ్యక్తులు కరోనా పరీక్షలు చేయించుకోవాలి అన్నారు. జ్వరం, చలి, దగ్గు అలసట, గొంతు నొప్పి రుచి లేదా వాసన కోల్పోడం తలనొప్పి వంటి లక్షణాలుంటే నిర్దారణ కోసం సమీపంలోని ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. కరోనా విషయంలో జాగ్రత్తలు అవసరమని అధికారులు సూచిస్తున్నారు.