loading
0%22,Feb-2026
విజయవాడలో ప్రపంచ తెలుగు కవుల మహాసభలు – డా. ఉమర్ ముక్తార్కు “యువశ్రీ” గౌరవ పురస్కారం
విజయవాడ: అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం లో నిర్వహించిన ప్రపంచ తెలుగు కవుల మహాసభలు సాహిత్య వాతావరణాన్ని సృష్టించాయి. మాజీ అధికార భాషా సంఘం చైర్మన్ పొట్లూరి హరికృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ మహాసభలో ప్రపంచం నలుమూలల నుంచి సుమారు 3000 మంది కవులు, సాహిత్యాభిమానులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ ఉమర్ ముక్తార్ సభలో పాల్గొనడం తనకు గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. వేలాది మంది కవులను ఉద్దేశించి మాట్లాడే అవకాశం దక్కడం తన అదృష్టమని అన్నారు.
సభ వేదికపై భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు చేతుల మీదుగా డా. ఉమర్ ముక్తార్ “యువశ్రీ” గౌరవ పురస్కారం అందుకున్నారు. ఈ ఘట్టం తన జీవితంలో ప్రత్యేకమని, ఇది తన వ్యక్తిగత గౌరవం మాత్రమే కాకుండా తెలుగు భాషపై తన ప్రేమకు, సేవా సంకల్పానికి గుర్తింపని పేర్కొన్నారు.
తన ప్రసంగంలో గ్రామీణ స్థాయిలో తెలుగు భాష అభివృద్ధికి జానపద గీతాలు, రంగస్థలం కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు. ప్రతి కవి తన కలం ద్వారా తెలుగు తల్లి గౌరవాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
“తెలుగు భాషను గ్రామం నుంచి ప్రపంచం వరకు ప్రాచుర్యం పొందేలా చేయడం మన అందరి బాధ్యత. మాతృభాష మన ఆత్మ – దాన్ని కాపాడటం మన కర్తవ్యము” అని డా. ఉమర్ ముక్తార్ అన్నారు.