loading
0%19,Apr-2025
గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) మేయర్పై ఈ నెల 19న అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. అదే రోజు అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ కూడా జరగనుంది.
వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని వ్యతిరేకిస్తూ జీవీఎంసీ మేయర్పై అవిశ్వాస తీర్మానానికి నోటీసులిచ్చినట్లు కూటమి (టీడీపీ, బీజేపీ, జనసేన) పార్టీల నేతలు చెబుతున్నారు. కౌన్సిల్లో తగినంత సంఖ్యాబలం లేకపోయినా కూటమి నేతలు అవిశ్వాస తీర్మానానికి సిద్ధమయ్యారని వైసీపీ నేతలు అంటున్నారు.
జీవీఎంసీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానానికి సంబంధించి టీడీపీ, జనసేన, బీజేపీ కార్పొరేటర్లు ఇప్పటికే జీవీఎంసీ ఇన్చార్జి కమిషనర్, జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్కు నోటీసు అందజేశారు.
ఏప్రిల్ 19న అవిశ్వాస తీర్మానానికి అధికారులు రంగం సిద్ధం చేశారు.
అయితే, కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు దాటినప్పటికీ.. ఇప్పటివరకు అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టలేదు? ఏప్రిల్ 19నే అవిశ్వాసం వెనుక మతలబేంటి?
అవిశ్వాసం నెగ్గితే విశాఖ మేయర్ పీఠం ఎవరికి దక్కబోతోంది?
జీవీఎంసీలో ఎవరి బలం ఎంత?
నాలుగేళ్ల క్రితం జీవీఎంసీకి జరిగిన ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ వైసీపీ 59, టీడీపీ 29, జనసేన 3, సీపీఐ, సీపీఎం, బీజేపీ ఒక్కొక్క వార్డు గెలుచుకున్నాయి. ఇండిపెండెంట్లు నాలుగుచోట్ల విజయం సాధించారు. మొత్తం 98 స్థానాలు.
2024 శాసన సభ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో కౌన్సిల్లో పార్టీల లెక్కల్లో తేడాలొచ్చాయి.
వైసీపీకి చెందిన దాదాపు 20 మంది కార్పొరేటర్లు టీడీపీ, జనసేనలో చేరిపోయారు. అలాగే, ఇండిపెండెట్లు కూడా ఇద్దరు టీడీపీ, మరో ఇద్దరు జనసేనలో చేరిపోయారు. దీంతో కౌన్సిల్లో కూటమి బలం 53కి పెరిగింది. వైసీపీ బలం 38కి తగ్గిపోయింది.
వీరిలో కూడా చాలామంది కూటమి నాయకులతో టచ్లో ఉండటంతో తమ బలం ప్రస్తుతం 74కి చేరినట్లుగా కూటమి నాయకులు చెబుతున్నారు.
ఇప్పుడు సంఖ్యాబలం, సమయం అనుకూలంగా మారడంతో వైసీపీకి చెందిన మేయర్ గొలగాని హరి వెంకటకుమారిని పదవి నుంచి దించేందుకు కూటమి నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
నాలుగేళ్ల నిబంధనే కారణమా?
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్గా అవతరించిన తర్వాత, జీవీఎంసీ పాలకవర్గానికి నాలుగేళ్లు నిండేవరకూ అవిశ్వాసానికి వీలుపడదనే నిబంధన పెట్టారు.
దీంతో, కూటమి పార్టీలు మేయర్ పీఠంపై అవిశ్వాసం పెట్టేందుకు ఇప్పటివరకూ ఎదురుచూడాల్సి వచ్చింది. ఏప్రిల్ 18కి నాలుగేళ్లు పూర్తవ్వడంతో.. 19న అవిశ్వాసానికి సిద్ధమయ్యారు.
"అవిశ్వాసం నోటీసులు ఇవ్వడంతో వైసీపీ నేతలు తమ కార్పొరేటర్లను బెంగళూరు, శ్రీలంకకు తరలించి క్యాంప్ ఏర్పాటు చేశారు. దీనికి ప్రతిగా కూటమి నాయకులు తమ సభ్యులను మలేసియా ట్రిప్కు పంపించారు. క్యాంపులతో జీవీఎంసీ అధికార, ప్రతిపక్ష పార్టీలు రాజకీయ వ్యూహాలకు సిద్ధమయ్యాయి" అని సీనియర్ జర్నలిస్ట్ ఎస్.శివప్రసాద్ బీబీసీతో అన్నారు.
అవిశ్వాస తీర్మానం నెగ్గడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 74. జీవీఎంసీలో మొత్తం డివిజన్లు 98. ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిపి ఎక్స్అఫీషియో సభ్యులు మరో 13.
తాజాగా, కోఆప్షన్ సభ్యుడు బెహరా భాస్కరరావు, గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు వంశీ వైసీపీ నుంచి కూటమిలో చేరుతున్నట్టు ప్రకటించారు. దీంతో కూటమి మ్యాజిక్ ఫిగర్కు చేరుకున్నట్టయింది.
అవిశ్వాస తీర్మానంపై జీవీఎంసీ మేయర్ మాట్లాడుతూ.
"తన సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, పల్లా శ్రీనివాసరావులే తనను పదవి నుంచి దింపేందుకు ప్రయత్నిస్తున్నారు" అని మేయర్ హరి వెంకట కుమారి ఆరోపించారు. ఆమె యాదవ సామాజికవర్గానికి చెందినవారు.
అయితే, అభివృద్ధి విషయంలో వైసీపీ కార్పొరేటర్లు తమకు సహకరించడం లేదని, దీంతో జీవీఎంసీ అభివృద్ధి కుంటుపడిందని గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు.
"అందుకే, మేయర్ పై అవిశ్వాసం పెడుతున్నాం. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మా హయాంలో నగరాభివృద్ధికి బాటలు వేస్తాం. యాదవులే తనని దింపేస్తున్నారని మేయర్ అనడం హాస్యాస్పదం" అన్నారాయన.
మరోవైపు, మేయర్ పదవికి ఎలాంటి ఢోకా లేదంటున్నారు మాజీ మంత్రి, వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్.
"టీడీపీలో అసంతృప్తితో ఉన్న కార్పొరేటర్లు మాకు అనుకూలంగా ఉన్నారు" అని అమర్నాథ్ అన్నారు.
"వైసీపీ నుంచి గెలిచిన 58 మంది కార్పొరేటర్లకు విప్ జారీ చేస్తాం. విప్ ధిక్కరిస్తే, చట్టపరంగా చర్యలు ఉంటాయి" అని అమర్నాథ్ చెప్పారు.